29, మార్చి 2013, శుక్రవారం

సిర్సనగండ్ల సీతారామాలయం (Sirsanagandla Seeta Ramalayam)

అపరభద్రాద్రిగా పేరుగాంచిన సిర్సనగండ్ల  ఆలయం పాలమూరు జిల్లా వంగూరు మండలంలో నెలకొని ఉంది. ఈ ఆలయాన్ని 14వ శతాబ్దిలో నిర్మించబడినట్లు శిలాశాసనాల వల్ల తెలుస్తుంది. అప్పడు ఈ ప్రాంతం భీకర అరణ్యంగా ఉండేదని, గుట్టపై దత్తాత్రేయ ఆశ్రమం, ముత్యాలమ్మ గుడి ఉండేవని ప్రతీతి. సిర్సనగండ్ల గ్రామానికి చెందిన రామయాజ్వికి శ్రీరాముడు కలలో కనిపించి భద్రాచలంలో ప్రతిష్టించాల్సిన సీతారామ విగ్రహాలు ఖమ్మం జిల్లా పాల్వంచ సమీపంలోని రావిచేడ్ గ్రామంలో ఒక పురోహితుడి ఇంటి పెరటిభాగంగా ఉన్నట్లు చెప్పినట్లు, ఆ విగ్రహాలు సకాలంలో భద్రాచలానికి చేరనందున వేరే విగ్రహాలు అక్కడ ప్రతిష్టించినట్లు, వాటిని సిర్సనగండ్లలో ప్రతిష్టించమని చెప్పినట్లు కథనం ప్రచారంలో ఉంది. కలలో శ్రీరాముడు చెప్పిన విధంగా పాల్వంచ సమీపంలోని విగ్రహాలు తీసుకొని వచ్చికోడికూత, రోకలిమోత వినిపించని సిర్సనగండ్ల గుట్టపై ప్రతిష్టించబడినట్లు, గుట్టపై కోనేరు కూడా నిర్మించినట్లు తెలుస్తుంది. ఈ ఆలయం కల్వకుర్తి నుంచి దేవరకొండ వెళ్ళు రహదారిలో కల్వకుర్తి నుంచి 30 కిమీ దూరంలో ఉన్న చారకొండ నుంచి 5 కిమీ లోనికి ఉంది. ఏటా ఇక్కడ చైత్రశుద్ధ్య పాడ్యమి నుంచి నవమి వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఢేరము జంబురాలు సిర్సనగండ్ల రామచరిత్రము అనే యక్షగానాన్ని రచించాడు.

విభాగాలు: పాలమూరు జిల్లా దేవాలయాలు,  వంగూరు మండలము, 

= = = = =

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి