9, మే 2013, గురువారం

తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం (Tandur Assembly Constituency)

రంగారెడ్డి జిల్లా లోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలలో తాండూరు అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. 2007 నాటి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ప్రకారము ఈ నియోజకవర్గం 4 మండలాలు కలవు. ఇంతకు క్రితం ఈ నియోజకవర్గం హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండేది. పునర్విభజన ఫలితంగా నూతనంగా ఏర్పడిన చేవెళ్ళ లోకసభ నియోజకవర్గంలో భాగమైంది. 1962 నుంచి ఇప్పటి వరకు జరిగిన 11 ఎన్నికలలో 8 సార్లు కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగా, 3 సార్లు తెలుగుదేశం పార్టీ గెలుపొందినది. ముఖ్యమంత్రిగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి ఇక్కడి నుంచి 2 సార్లు విజయం సాధించగా, బషీరాబాదుకు చెందిన సోదరులు ముగ్గురు కలిసి (మాణిక్ రావు, చంద్రశేఖర్, నారాయణరావు) 6 సార్లు ప్రాతినిధ్యం వహించారు. ప్రస్తుతం ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పి.మహేందర్ రెడ్డి మూడో సారి ఇక్కడీ నుంచి విజయం సాధించారు. ఎం.మాణిక్ రావు మరియు ఎం.చంద్రశేఖర్‌లు రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం పొందారు.

నియోజకవర్గం పరిధిలోని మండలాలు:
  • తాండూరు
  • పెద్దేముల్‌
  • బషీరాబాద్‌
  • యాలాల్
ఎన్నికైన శాసనసభ్యులు

సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1962 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ సి.శేఖర్ స్వతంత్ర అభ్యర్థి
1967 మర్రి చెన్నారెడ్డి కాంగ్రెస్ పార్టీ వి.రామచందర్ రావు స్వతంత్ర అభ్యర్థి
1972 ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ ఎన్నిక
1978 ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ సిరిగిరిపేట్ రెడ్డి జనతా పార్టీ
1983 ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ సిరిగిరిపేట్ రెడ్డి ఇండిపెండెంట్
1985 ఎం.చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ సిరిగిరిపేట్ బాలప్ప తెలుగుదేశం పార్టీ
1989 ఎం.చంద్రశేఖర్ కాంగ్రెస్ పార్టీ పసారాం శాంత్‌కుమార్ తెలుగుదేశం పార్టీ
1994 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ
1999 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.మాణిక్ రావు కాంగ్రెస్ పార్టీ
2004 ఎం.నారాయణ రావు కాంగ్రెస్ పార్టీ పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 పి.మహేందర్ రెడ్డి తెలుగుదేశం పార్టీ ఎం.రమేష్ కాంగ్రెస్ పార్టీ
2014 పి.మహేందర్ రెడ్డి తెరాస నారాయణరావు కాంగ్రెస్ పార్టీ

నియోజకవర్గంలో పార్టీల బలాబలాలు:
ఈ నియోజకవర్గంలో ప్రారంభం నుంచి కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యంలో ఉంది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత కూడా కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని వదులుకోలేదు. 1985 మరియు 1989 ఎన్నికలలో ఎం.చంద్రశేఖర్ వరుసగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలుపొందినారు. అంతకు క్రితం వరకు చంద్రశేఖర్ సోదరుడు ఎం.మాణిక్ రావు గెలుపొందుతూ తన సోదరునికి స్థానం ఇచ్చారు.  ఎం.చంద్రశేఖర్ ఆకస్మిక మరణం తరువాత మరో సోదరుడు ఎం.నారాయణ రావు బరిలో దిగిననూ 1994లో తొలిసారిగా తెలుగుదేశం పార్టీకి విజయం లభించింది. 1999లో మళ్ళీ మాజీ రోడ్డు, భవనాల మంత్రి అయిన ఎం.మాణిక్ రావు స్వయంగా రంగంలోకి దిగిననూ ఫలితం దక్కలేదు. 2004లో ఎం.నారాయణరావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరియు తెలుగుదేశం మినహా మూడో పార్టీ అంతగా బలపడలేదు. కాని లోక్‌సభ ఎన్నికలలో మరియు పురపాలక సంఘపు ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ గణనీయమైన ఓట్లను సాధించగలిగింది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఈ సెగ్మెంటు హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉండి ఇక్కడి నుంచి భాజపా తరఫున పోటీచేసిన బద్దం బాల్‌రెడ్డి తాండూరు నియోజకవర్గంలో చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. అలాగే పురపాలక సంఘ ఎన్నికలలో ఇంతకు క్రితం భాజపాకు చెందిన నాగారం నర్సిములు చెర్మెన్‌గా పనిచేశారు.

2009 ఎన్నికలు
2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున పి.మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎం.రమేష్ పోటీచేశారు. మహేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ మంత్రి కుమారుడు ఎం.రమేష్‌పై 13,205 ఓట్ల తేడాతో విజయం సాధించారు.

2014 ఎన్నికలు:
2014 ఎన్నికలలో ఇక్కడి నుంచి తెరాస తరఫున పోటీచేసిన సిటింగ్ ఎమ్మెల్యే పి.మహేందర్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎం.నారాయణరావుపై 16074 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు.

విభాగాలు: రంగారెడ్డి జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు, చేవెళ్ళ లోకసభ నియోజకవర్గం,  తాండూరు,

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి