2, మార్చి 2019, శనివారం

ఇందిరాగాంధీ (Indira Gandhi)

జననంనవంబర్ 19, 1917
పదవులుప్రధానమంత్రి
గుర్తింపులుభారతరత్న (1971)
మరణంఅక్టోబర్ 31, 1984
భారతదేశపు మొట్టమొదటి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి అయిన ఇందిరాగాంధీ నవంబర్ 19, 1917న అలహాబాదులో జన్మించారు. ఆమె 1966 నుండి 1977 వరకు వరుసగా 3 పర్యాయాలు మరియు 1980లో 4వ పర్యాయం ప్రధానమంత్రిగా పనిచేసింది. ఇందిర భారత తొలి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఏకైక కుమార్తె మరియు స్వాతంత్ర్యోద్యమ నాయకుడు మోతీలాల్ నెహ్రూ మనుమరాలు. ఇందిరాగాంధీ తల్లి కమలానెహ్రూ. ప్రధానమంత్రిగా పనిచేసిన రాజీవ్‌గాంధీ ఈమె కుమారుడు. 1971లో ఇందిరాగాంధీకి భారతదేశపు అత్యున్నతమైన భారతరత్న పురస్కారం లభించింది.

ఇందిర తొలి పేరు ప్రియదర్శిని ఇందిర. చిన్న వయస్సులోనే వానరసేనను ఏర్పాటుచేసింది. మెట్రిక్ తర్వాత రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన శాంతినికేతన్‌లో చేరింది. 1942లో ఫిరోజ్ గాంధీతో వివాహమైంది. 1959లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. నెహ్రూ మరణానంతరం 1964లో లాల్ బహదూస్ శాస్త్రి మంత్రివర్గంలో ఇందిర సమాచారశాఖ మంత్రిగా పదవి పొందారు. లాల్ బహదుర్ శాస్త్రి మరణం తర్వాత 1966లో భారత 3వ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి 1980 వరకు దేశాన్ని పాలించారు. రాజభరణాల రద్దు, బ్యాంకుల జాతీయీకరణ, గరీబీ హటావో నినాదంతో చేపట్టిన పేదరిక నిర్మూలన పథకాలు, 20 సూత్రాల పథకం, ఇండోపాక్ యుద్ధం, బంగ్లాదేశ్ అవతరణ తదితర ముఖ్యమైన పరిణామాలు ఇందిర హయంలోనే జరిగాయి.

1971లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అమేథీలో ఇందిర ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పు ఇవ్వడంతో ఇది రాజకీయ సంక్షోభానికి చివరికి దేశంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటానికి దారితీసింది. రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చే అత్యవసర పరిస్థితి విధించిన ఇందిర అప్పటి ముఖ్యమైన ప్రతిపక్ష నాయకులందరినీ జైళ్ళకు పంపించింది. దీని ప్రభావం 1977లో జరిగిన ఎన్నికలలో ఇందిరాగాంధీ ఓడిపోవడానికి దారితీసింది. ఇందిర స్వయంగా రాయ్‌బరేలీ నియోజకవర్గంలో కూడా ఓటమి పాలయ్యారు. 1977లో జనతాపార్టీ ప్రభుత్వం ఏర్పడింది. మురార్జీ దేశా, చరణ్ సింగ్‌ల ప్రభుత్వాలు అధికకాలం కొనసాగలేవు. 1980లో మధ్యంతర ఎన్నికలలో మళీ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయ్యారు. స్వర్ణదేవాలయంలో సైనికులను పంపారనే కారణంతో (ఆపరేషన్ బ్లూస్టార్) ఆమె అంగరక్షకులైన ఇద్దరు సిక్కులు ఆమెను అక్టోబర్ 31, 1984న కాల్చి చంపారు. ఇందిర మరణం తర్వాత ఆమె కుమారుడు రాజీవ్ గాంధి ప్రధానమంత్రి అయ్యారు.

ఇవి కూడా చూడండి:

విభాగాలు: భారతదేశ ప్రధానమంత్రులు, భారతరత్న అవార్డు గ్రహీతలు, భారతదేశ రాజకీయ నాయకులు, భారతదేశ ప్రముఖ మహిళలు


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి