23, జులై 2020, గురువారం

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)

రాజధానిలక్నో
వైశాల్యం2,40,928 చకిమీ
జనాభా1.99 కోట్లు (2011)
హైకోర్టుఅలహాబాదు
ఉత్తరప్రదేశ్ భారతదేశంలో అత్యధిక జనాభా కల్గిన రాష్ట్రం. 1937లో యునైటెడ్ ప్రావిన్సు పేరుతో ఏర్పడి 1950లో ఉత్తరప్రదేశ్‌గా పేరుమారిన ఈ రాష్ట్రం 75 జిల్లాలను కల్గియుంది. 2000లో వాయువ్య భాగం ఈ రాష్ట్రం నుంచి విడిపోయి కొత్తగా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఏర్పడింది. హిమాలయాలపై ఉన్న ఈ రాష్ట్రం గుండా ప్రవహించు ముఖ్యనది గంగానది మరియు దాని ఉపనది యమునానది. రాష్ట్ర రాజధాని లక్నో. హైకోర్టు అలహాబాదులో ఉంది. ఆగ్రా, అయోధ్య, ప్రయాగ రాష్ట్రంలోని ప్రముఖ పర్యాటకప్రాంతాలు. లక్నో, ఘజియాబాదు, అలహాబాదు, వారణాసి, కాన్పూర్, ఆగ్రా, మీరట్ ఈ రాష్ట్రంలోని ప్రముఖ నగరాలు.

భౌగోళికం, సరిహద్దులు:
ఈ రాష్ట్రం భౌగోళికంగా భారతదేశంలో ఉత్తరాన ఉంది. తూర్పున బీహార్, దక్షిణాన మధ్యప్రదేశ్, పశ్చిమాన రాజస్థాన్, వాయువ్యాన హర్యానా మరియు ఢిల్లీ, ఉత్తరాన ఉత్తరాఖండ్ రాష్ట్రంతో పాటు నేపాల్ సరిహద్దులుగా ఉన్నాయి. రాష్ట్ర విస్తీర్ణం 2,40,928 చకిమీ. ఇది దేశ విస్తీర్ణంలో 7.34%. విస్తీర్ణంలో దేశంలో 4వ స్థానంలో ఉంది.

చరిత్ర:
ఉత్తరప్రదేశ్ చాలా పురాతమైన చరిత్రను కల్గియుంది. శ్రీరాముడు జన్మించిన అయోధ్య, శ్రీకృష్ణుడు జన్మించిన మధుర, గౌతమబుద్ధుడు పరినిర్వాణం చెందిన కుషినగర్ ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. షోడస మహాజనపదాలలో అత్యధికంగా ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రాంతంలో విలసిల్లాయి. ఉత్తర భారతాన్ని పాలించిన ప్రముఖ రాజవంశాలైన మౌర్యులు, గుప్తుల కాలంలో ఈ ప్రాంతం భాగంగా ఉండేది. మధ్యయుగంలో కనోజ్‌పై ఆధిపత్యం కోసం పలు రాజవంశాల మధ్య యుద్ధాలు జరిగాయి. ఢిల్లీ సుల్తానులు, మొఘలుల కాలంలో కూడా ఇది భాగంగా ఉండేది.  అక్బర్, జహంగీర్, షాజహాన్‌లు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రాజధానిగా పాలించారు. బ్రిటీష్ కాలంలో అలహాబాదు రాజధానిగా ఉండేది. 1857 సిపాయిల తిరుగుబాటు మీరట్ నుంచి ప్రారంభమైంది. ప్రముఖ సమరయోధులు రాంప్రసాద్ బిస్మిల్ మరియు చంద్రశేఖర్ ఆజాద్ లాంటివారు ఈ రాష్ట్రానికి చెందినవారు. 1920లో ప్రావిన్స్ రాజధానిని అలహాబాదు నుంచి లక్నోకు తరలించారు. స్వాతంత్ర్యానంతరం 1950లో రాష్ట్రం పేరు ఉత్తరప్రదేశ్‌గా మార్చబడింది. 2000లో ఉత్తరాఖండ్ విడిపోయింది.
ఢిల్లీ-నోయిడా జాతీయ రహదారి

రాజకీయాలు:
దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు, 31, రాజ్యసభ స్థానాలు, 404 శాసనసభ స్థానాలు ఉన్నాయి. జవహార్‌లాల్ నెహ్రూ, శాస్త్రి, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ లాంటి ప్రధానమంత్రులు ఈ రాష్ట్రం నుంచే ఎన్నికయ్యారు. మధ్యలో కొంతకాలం మినహా 1977 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. 1977లో జనతాపార్టీ, 1989లో జనతాదళ్, 1991లో భాజపా అధికారంలోకి వచ్చాయి. ఆ తర్వాత సమాజ్‌వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలి కూడా అధికారం చేపట్టాయి. 1975లో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ఉద్యమించిన జయప్రకాశ్ నారాయణ ఈ రాష్ట్రానికి చెందినవారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన చరణ్‌సింగ్, విశ్వనాథ్ ప్రతాప్ సింగ్‌లు ప్రధానమంత్రులుగా కూడా పనిచేశారు.
ధ్యాన్‌చంద్

క్రీడలు:
ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రధాన క్రీడ క్రికెట్. కాన్పూర్‌లో ప్రముఖమైన గ్రీన్‌పార్క్ స్టేడియం ఉంది. హాకీ మాంత్రికుడిగా పేరుపొందిన ధ్యాన్‌చంద్ ఈ రాష్ట్రానికి చెందినవాడు.

ఇవి కూడా చూడండి:

హోం
విభాగాలు: భారతదేశ రాష్ట్రాలు, ఉత్తరప్రదేశ్,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి