15, ఏప్రిల్ 2013, సోమవారం

మహబూబ్‌నగర్ పట్టణం (mahabubnagar Town)

మహబూబ్‌నగర్ జిల్లా కేంద్ర స్థానమైన మహబూబ్‌నగర్ పట్టణం భౌగోళికంగా జిల్లా మధ్యలో రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు నైరుతి వైపున 100 కిలోమీటర్ల దూరంలో 16°74" ఉత్తర అక్షాంశం, 78°00" తూర్పు రేఖాంశంపై ఉన్నది. చుట్టూ ఎత్తయిన కొండలు, గుట్టలచే ఆవరించబడిన ఈ పట్టణానికి రవాణా పరంగా రోడ్డు మరియు రైలు మార్గాన మంచి సౌలభ్యముంది. వ్యవసాయికంగా మరియు పారిశ్రామికంగా ఈ పట్టణం అంతగా అభివృద్ధి చెందలేదు. పట్టణ పాలన స్పెషల్ గ్రేడు పురపాలక సంఘంచే నిర్వహించబడుతుంది. జిల్లా కేంద్రం కావడంతో మండల, డివిజన్ స్థాయి కార్యాలయాలతో పాటు అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి ప్రభుత్వ కార్యాలయాలు పట్టణంలో ఉన్నాయి. పాలమూరు అని కూడా పిల్వబడే ఈ పట్టణానికి చరిత్రలో రుక్కమ్మపేట అని పేరు ఉండేది. 1883 నుండి ఈ పట్టణం జిల్లా కేంద్రంగా సేవలందిస్తున్నది. రాజకీయంగా ఈ పట్టణం నుంచి పలువురు నాయకులు ప్రసిద్ది చెందినారు. ప్రముఖ సమరయోధుడు, మాజీ మంత్రి, లోకసభ సభ్యునిగా పనిచేసిన పల్లెర్ల హన్మంతరావు, యువ కవిగా, కళాకారునిగా పేరుపొందిన పల్లెర్ల రామోహనరావు, 2009 శాసనసభ ఎన్నికలలో మహబూబ్‌నగర్ స్థానం నుంచి గెలుపొందిన ఎన్.రాజేశ్వర్ రెడ్డి పట్టణానికి చెందిన వ్యక్తులే. పట్టణంలో కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, భాజపా, తెరాసలు బలంగా ఉన్నాయి. పట్టణ సమీపంలో పర్యాటక ప్రాంతంగా ప్రసిద్ధి చెందిన పిల్లలమర్రి పేరుతో 700 సంవత్సరాల చరిత్ర ఉన్న పురాతనమైన, విశాలమైన మర్రి చెట్టు ఉంది.

పట్టణ చరిత్ర
ఈ ప్రాంతంలో పాలు, పెరుగు సమృద్ధిగా లభించుట కారణంగా ఈ పట్టణానికి పాలమూరు అని పేరు వచ్చినట్లు, పాలగొడిసె వృక్షాలు నరికి ఈ పట్టణాన్ని నిర్మించినందున ఈ పేరువచ్చినట్లు విభిన్న కథనాలు ప్రచారంలో ఉన్నాయి. హైదరాబాదును పాలిస్తున్న ఆరవ నిజాం మీర్ మహబూబ్ అలీ ఖాన్ పేరు మీదుగా ఈ పట్టణ నామాన్ని మహబూబ్‌నగర్‌గా మార్చబడింది. ఇప్పటికీ గ్రామీణ ప్రజలు పాలమూరు నామంతోనే వ్యవహరిస్తారు. మొదట చిన్న పట్టణంగా ఉన్న మహబూబ్‌నగర్‌ను జిల్లా కేంద్రం చేయడంతో క్రమక్రమంగా అభివృద్ధి చెందనారంభించింది. 1883లో జిల్లా ప్రధానకేంద్రం నాగర్‌కర్నూలు నుంచి మహబూబ్‌నగర్‌కు మార్చబడింది. నాగర్‌కర్నూలు జిల్లా కేంద్రంగా ఉన్న సమయంలో ఇక్కడ రైలు మార్గం ఏర్పాటు కావడంతో సౌలభ్యం దృష్ట్యా జిల్లా కేంద్రాన్ని ఇక్కడికి మార్చినారు. ప్రారంభంలో లోకాయపల్లి సంస్థానంలో ఉన్న ఈ ప్రాంతం చుక్కాయపల్లిగా కూడా పిలువబడింది. ఈ ప్రాంతానికి అనేక ప్రాంతాల నుంచి వచ్చినవారు స్థిరపడడంతో పాలమూరు, పాతపాలమూరు, న్యూటౌన్ అనే మూడు ప్రాంతాలు ఏర్పడ్డాయి. నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజాకర్లపై జరిగిన ఉద్యమంలో ఈ ప్రాంతానికి చెందిన పలువులు పాల్గొన్నారు. ఆ సమయంలో ఇక్కడ ఆర్యసమాజ్ శాఖ బలంగా ఉండేది. క్రమేణా ఈ మూడు ప్రాంతాలు ఏకమైనాయి. ప్రస్తుతం సుమారు 2 లక్షల జనాభా కల ఈ పట్టణంలో 38 వార్డులు కలవు.

రవాణా వ్యవస్థ
రోడ్డు రవాణా

రాష్ట్ర రాజధాని హైదరాబాదుకు కేవలం 100 కిలోమీటర్ల దూరంలోనే ఉండుట మరియు హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రముఖ నగరాలకు వెళ్ళు రహదారి ఈ పట్టణం గుండా పోవుటచే రోడ్డు రవాణా సౌకర్యవంతంగా ఉన్నది. 7వ నెంబరు జాతీయ రహదారి పట్టణానికి 8 కిలోమీటర్ల దూరం నుంచి (భూత్పూర్ వైపు) వెళ్ళుచున్నది. హైదరాబాదు నుంచి కర్ణాటక రాష్ట్రపు ప్రధాన నగరాలైన రాయచూరు, ఉడిపి, మంగళూరు, బళ్ళారి, గదగ్ మరియు గోవా-పనాజీ వైపు వెళ్ళు బస్సులు మహబూబ్ నగర్ పట్టణం గుండా వెళుతాయి.

పాలమూరు పట్టణ ప్రధాన రైల్వేస్టేషన్
రైలు రవాణా
దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాదు డివిజన్‌లో ప్రధాన రైల్వే స్టేషన్లలో ఒకటైన మహబూబ్‌నగర్ సికింద్రాబాదు - ద్రోణాచలం మార్గంలో ఉంది. సికింద్రాబాదు నుంచి 100 కిలోమీటర్ల దూరంలోనూ, కర్నూలు నుంచి 130 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహబూబ్ నగర్, కాచిగూడ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలుబండితో సహా మొత్తం 24 రైళ్ళు రోజూ ప్రయాణిస్తాయి. ఇవి కాకుండా వారానికి రెండు, మూడు సార్లు ప్రయాణించు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్ళు 8 సార్లు ప్రయాణిస్తాయి. మహబూబ్ నగర్ పట్టణంలో 2 రైల్వే స్టేషన్లు మరియు పట్టణ శివారులో ఒక రైల్వే స్టేషన్ ఉన్నది. ప్రధాన రైల్వే స్టేషన్ మినహా మిగితా రెండు రైల్వే స్టేషన్లలో ఎక్స్‌ప్రెస్ రైళ్ళు ఆగవు. ప్రధాన రైల్వే స్టేషన్‌లో నాలుగు ప్లాట్‌ఫారములు ఉన్నవి. ప్రారంభంలో మీటరు గేజిగా ఉన్న ఈ మార్గం తొలుత సికింద్రాబాదు-మహబూబ్‌నగర్ వరకు ఆ తర్వాత 1996లో మహబూబ్‌నగర్ నుంచి ద్రోణాచలం వలకు బ్రాడ్‌గేజీగా మార్చబడింది.

వాయు రవాణా
మహబూబ్ నగర్ పట్టణములో వాయు రవాణా సదుపాయము లేదు. సమీపంలోని విమానాశ్రయము శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయము. ఇది పట్టణానికి 80 కిలోమీటర్ల దూరంలో ఉంది.

పట్టణ పాలన
మహబూబ్‌నగర్ పట్టణపు పాలన స్పెషన్ గ్రేడ్ పురపాలక సంఘముచే నిర్వహించబడుతుంది. పట్టణములో నీటిసరఫరా, వీధిదీపముల నిర్వహణ, డ్రైనేజీ నిర్వహణ, పారిశుద్ధ్యం తదితర కార్యకలాపాలు పురపాలక సంఘముచే చేపట్టబడుతుంది. నిజాం కాలంలో "ధరోగా సఫాయి"గా పిల్వబడిన పట్టణ పురపాలక స్థాయి అంచెలంచెలుగా పెరుగుతూ వచ్చింది. 1952లో మహబూబ్‌నగర్‌కు మున్సీపాలిటీగా గుర్తింపునిచ్చారు. అప్పుడు పురపాలక సంఘంలో 15 వార్డులు ఉండగా ప్రస్తుతం 38 వార్డులు ఉన్నాయి. ప్రారంభంలో మున్సీపాలిటీ స్థాయి మూడవగ్రేడు ఉండగా, ఇది కూడా క్రమక్రమంగా పెరుగుతూ ప్రస్తుతం స్పెషల్ గ్రేడు స్థాయికి పెరిగింది. తలపండిన మేధావులు, రాజకీయ ఉద్ధండులు ఈ పురపాలక సంఘానికి చైర్మెన్లుగా వ్యవహరించారు.

శాంతి భద్రతలు
పట్టణంలో శాంతిభద్రతలకై 3 పోలీస్ స్టేషన్లు, ఒక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉన్నాయి. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ రాయచూరు, భూత్‌పూర్ వెళ్ళే కూడలి అయిన పరదేశీనాయుడు చౌక్ వద్ద, టూటౌన్ పోలీస్ స్టేషన్ న్యూటౌన్ ప్రాంతంలోనూ, రూరల్ పోలీస్ స్టేషన్ హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉండగా, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ న్యూటౌన్ ప్రాంతంలో టూటౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉంది.

విద్యుత్తు సరఫరా
పట్టణంలో విద్యుత్తు సరఫరాకై 350 ట్రాన్స్‌ఫార్మర్లు ఉండగా, వీటి ద్వారా 40,000 కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా అవుతుంది. విద్యుత్తు సరఫరాకై పట్టణాన్ని 3 విభాగాలుగా చేసి, ప్రతి విభాగంలోనూ ఎస్.ఇ.స్థాయి అధికారి నేతృత్వంలో కార్యాలయాలు ఏర్పాటుచేయబడినవి. ప్రధాన విద్యుత్ కార్యాలయము పద్మావతి కాలనీలో హైదరాబాదు వెళ్ళు మార్గంలో ఉంది.

రాజకీయాలు
మహబూబ్ నగర్ పట్టణము మహబూబ్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గం, మహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. లక్షకు పైగా పట్టణ ఓటర్లు ఉండుటచే శాసనసభ స్థానంలో ఈ పట్టణము తన ఉనికిని నిరూపించుకుంటోంది. ప్రధాన రాజకీయ పక్షాలు తెలుగుదేశం పార్టీ మరియు కాంగ్రెస్ పార్టీలు ఉండగా, భారతీయ జనతా పార్టీకి కూడా పట్టణంలో గుర్తింపు ఉంది. 2012 మార్చిలో జరిగిన మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలలో పట్టణ ప్రాంతం నుంచి భాజపా, తెరాసలకు తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీక కంటె అధికంగా ఓట్లు లభించాయి.

క్రీడలు
పట్టణంలో క్రికెట్ క్రీడకు మంచి జనాదరణ ఉంది. ఇవే కాకుండా వాలీబాల్, ఫుట్‌బాల్, కబడ్డీ తదితర క్రీడలకు కూడా గుర్తింపు ఉంది. పట్టణం మధ్యలో బస్టాండు సమీపంలో ఉన్న క్రికెట్ స్టేడియంలో అంతర్‌జిల్లా క్రికెట్ పోటీలు, ఇతర పోటీలు నిర్వహించబడుతాయి. బాలుర జూనియర్ కళాశాల మైదానంలో కూడా క్రికెట్, ఫుట్‌బాల్ పోటీలు నిర్వహించబడుతాయి. ఇవే కాకుండా జిల్లా పరిషత్తు మైదానంలో వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నికాయిట్ తదితర అంతర్రాష్ట్ర పోటీలు నిర్వహిస్తారు.

దేవాలయాలు
  • శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (పిల్లలమర్రి రైల్వే గేట్ వద్ద)
  • శ్రీ రాఘవేంద్రస్వామి దేవాలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీవీరాంజనేయస్వామి ఆలయం (పరిమళగిరి గుట్ట)
  • శ్రీవెంకటేశ్వరస్వామి దేవాలయం (కొత్త గంజ్)
  • శ్రీ రేణుకాఎల్లమ్మ దేవాలయం (కొత్త బస్టాండు వద్ద)
  • శ్రీరామాలయం (టీచర్స్ కాలనీ)
  • శ్రీఅయ్యప్ప దేవాలయం (అయ్యప్ప గుట్ట)
  • శ్రీకృష్ణమందిరము (కాలని)
  • శ్రీఆంజనేయస్వామి దేవాలయం (రైల్వేస్టేషన్ వద్ద)
పాలమూరు పట్టణంలోని
చారిత్రాత్మకమైన తూర్పుకమాన్
మహబూబ్‌నగర్ పట్టణంలోని సినిమా థియేటర్లు
  • తిరుమల థియేటర్
  • నటరాజ్ థియేటర్
  • నర్తకి థియేటర్
  • బాలాజీ థియేటర్
  • మహేశ్వరి థియేటర్
  • మేనక థియేటర్
  • వెంకటాద్రి థియేటర్
  • వెంకటేశ్వర థియేటర్
  • శ్రీకృష్ణ థియేట
  • శ్రీనివాస థియేటర్
  • హనుమాన్ థియేటర్
విద్యాసంస్థలు
  • పాలమూరు విశ్వవిద్యాలయం
  • ఎం.వి.ఎస్.డిగ్రీ కళాశాల
  • ఆదర్శ డిగ్రీ కళాశాల
  • గౌతమి డిగ్రీ కళాశాల
  • వనిత డిగ్రీ కళాశాల
  • వాసవి డిగ్రీ కళాశాల
  • స్వామి వివేకానంద డిగ్రీ కళాశాల
  • తక్షశిల డిగ్రీ కళాశాల
  • ఆదర్శ కాలేజీ ఆఫ్ టీచర్స్.
  • అల్ మదీనా కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్
  • కాలేజి ఆఫ్ టీచర్స్ ఎడ్యుకేషన్
  • శారద కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
  • సరోజినీ రాములమ్మ కాలేజీ ఆఫ్ ఫార్మసి
  • వైష్ణవి కాలేజి ఆఫ్ ఎడ్యుకేషన్
కాలరేఖ:
  • 2011, అక్టోబరు 30: మహబూబ్ నగర్ శాసనసభ్యుడు ఎన్.రాజేశ్వర్ రెడ్డి మరణం.
  • 2012 డిసెంబరు 18, 19: జిల్లా కేంద్రంలో తెలుగు మహాసభలు నిర్వహించబడ్డాయి.
  • 2012 మే 27: మహబూబ్ నగర్ పురపాలక సంఘంలో పరిసరాలలోని 10 గ్రామపంచాయతీలను విలీనం చేశారు.
  • 2012, ఏప్రిల్ 3: మహబూబ్‌నగర్ పట్టణ పరిధి విస్తరించబడింది. సమీపంలోని గ్రామాలు పురపాలకసంఘంలో విలీనం చేయబడ్డాయి.
  • 2014, జనవరి 7: జాతీయస్థాయి పైకా పోటీలు మహబూబ్‌నగర్ పట్టణంలో ప్రారంభమయ్యాయి. 



విభాగాలు: మహబూబ్‌నగర్ జిల్లా పట్టణాలు,  మహబూబ్‌నగర్ మండలము,  మహబూబ్‌నగర్ పట్టణం,  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక