7, జులై 2021, బుధవారం

రేనాటి చోళులు (Renati Chola):

రేనాటి చోళులు 
(Renati Chola):
పాలనాకాలం
క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం
పాలనా ప్రాంతం
ఇప్పటి కడప, కర్నూలు, చిత్తూరు, నల్గొండ,
రాజధాని
పెద్దచిప్పాలి
అధికార భాష
తెలుగు
తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో రేనాటి చోళులకు విశేషమైన స్థానం కలదు. .రేనాడు అని వ్యవహరింపబడిన ఇప్పటి కడప జిల్లాలోని పులివెందుల, కమలాపురం, ప్రొద్దుటూరు, జమ్ములమడుగు తాలూకాలు, చిత్తూరు జిల్లలోని మదనపల్లి, వాయల్పాడు తాలూకాలు)తెలుగు భాష శాసనభాషగా పరిణతి చెందింది. ఈ ప్రాంతాన్ని మహారాజవాడి లేక మార్జవాడి అని కూడా పిలుస్తారు. క్రీ.శ. 6వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు చోళవంశానికి చెందిన ఒక శాఖ ఈ ప్రాంతంలో రాజ్యం చేసి క్రమంగా ఏరువ, పొత్తపి, నెల్లూరు, కొణిదెన, నిడుగల్లు, కందూరు అను ప్రాంతీయ వంశంలుగా ఏర్పడ్డారు. 7వ శతాబ్దంలో పర్యటించిన హ్యూయాన్‌త్సాంగ్ ప్రస్తావించిన చుళియ రాజ్యమే రేనాటి చోళుల రాజ్యమని చరిత్రకారుల అభిప్రాయం. మొదట 7,000 గ్రామాల పరిమితి గల దేశం 16వ శతాబ్దినాటికి ఉదయగిరి పెనుగొండ దుర్గాల మధ్య అధిక భాగం ఆక్రమించి ఉంది.

ఈ వంశీయులు వేయించిన శాసనాలు తెలుగుభాషలో నున్నవి. మొట్ట మొదట తెలుగుభాషలో శాసనాలు వేయించిన కీర్తి రేనాటిచోళులకే దక్కింది.వీరి శాసనాలలో ఆంధ్రభాష స్థానమాక్రమించి, ప్రాకృత ప్రభావితమై, తెలుగు భాష ప్రాథమిక దశను సూచించింది. ప్రాకృత పదాలతో కలిసియున్న తెలుగు పదాలు, వింతవింత రూపాలతో కనిపించి, ఆంధ్రభాషా వికాసంను పరిణామంను సూచించును. వీరి శాసనాలలో ధనంజయుని కలమళ్ళ శాసనం మొదటి తెలుగు శాసనంగా (క్రీ.శ.) పరిగణించబడుతుంది.

వీరి మొదటి నివాసమగు చోళవాడి తెలంగాణలోని నేటి నల్గొండ, మహబూబునగరు ప్రాంతమని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. రేనాడు ఏడువేల దేశం.అనగా ఏడువేల గ్రామాలున్న దేశం.రేనాటిని పాలించిరి గావున వీరు రేనాటి చోళులు అయ్యారు. వీరి శాసనాల ప్రకారం వీరు కరికాల చోడుని సంతతివారని, సూర్యవంశీయులని, కాశ్యప గోత్రీయులని తెలిస్తుంది. కడప మండలము పాలించినవారు రేనాటి చోడులు. కాలక్రమానన వీరు పాకనాడను ఆక్రమించి చిన్న చిన్న కుటుంబాలుగా చీలి, రాజ్యాలను స్థాపించి పాలించారు. వీరిలో రేనాడు, పాత్తపినాడు, కొణిదెన, నెల్లూరు ప్రాంతాలను పాలించిన చోడవంశీయులు ప్రసిద్ధులు.

పుణ్యకుమారుని తిప్పలూరు శాసనం ప్రకారము వీరి రాజధాని కమలాపురం తాలూకాలోని పెదచెప్పలి. ఇచట ప్రాచీనకాలపు కోట చిహ్నాలు, తామ్రశాసనాలు, శిలాశాసనాలు లభ్యమైనాయి..

రేనాటి చోళులు మొదట పల్లవరాజులకడ సామంతులుగా ఉండి స్వతంత్రులయ్యారు. శాసనాలను బట్టి కరికాలుని వంశంలో నందివర్మ (క్రీ.శ.550), అతని కుమారులు సింహవిష్ణు, సుందరనంద, ధనంజయవర్మ (క్రీ.శ.575), కడపటివానికి మహేంద్రవిక్రమ (క్రీ.శ.600), వానికి గుణముదిత, పుణ్యకుమార అను ఇద్దరు కొడుకులు పుట్టారు. పుణ్యకుమారుడు (క్రీ.శ.625) హిరణ్యరాష్ట్రం ఏలాడు. అతని తర్వాత కొడుకు విక్రమాదిత్య (క్రీ.శ.650), శక్తికుమారుడు (క్రీ.శ. 675), రెండవ విక్రమాదిత్యుడు (క్రీ.శ.700), సత్యాదిత్యుడు, విజయాదిత్యుడు (క్రీ.శ.750) పాలించారు. క్రీ.శ.800లో శ్రీకంఠుడు రాజ్యం చేశాడు. దీనినిబట్టి రేనాటి చోళులు క్రీ.శ.550 నుండి క్రీ.శ. 850 వరకు సుమారు 3 శతాబ్దాలు రాజ్యం చేశారని తెలుస్తుంది..
నందలూరులొ రేనాటి చోళులు నిర్మించిన ఆలయం
పరిపాలనా విధానం
రేనాటి చోడులు స్వతంత్రముగ కడప, చిత్తూరు మండలములను పాలించినను కొంతకాలము, విష్ణుకుండినులు కు, పల్లవులుకు చాళుక్యులుకు సామంతులుగా వ్యవహరించిరి. వీరి కాలమున ఆంధ్రదేశము సుభిక్షముగా నుండెను.వీరు సూర్యరాధాధికులు.చోడమహారాజు ఆజ్ఞగైకొని, సూర్యగ్రహణ నిమిత్తమున సూర్యునికి దేవాలయమును నిర్మించి, దేవ భోగారము కొంతభూమిని, ఒక గానుగును దానమిచ్చినట్లు చిలంకూరు శాసనమువలన తెలియుచున్నది.

వీరి కాలమున భూమిని న్రితుడ్లలూను, మఱుతుడ్లలోను కొలిచెడివారు.ప్రతీ వైశాఖ పున్నమిరోజు పండుగలు జరుపెడివారు.దేశము మండలములగను, విషయములుగను, గ్రామములగ విభజింపబడెను.గ్రామములందు రట్టొడ్లు లేదా రాట్టులు, లేక రెడ్లు ప్రాముఖ్యము వహించుచుండిరి.వీరు రైతులనందు పన్నును వసూలు చెసి రాజుకు ఇచ్చుచుండి.

ఆ కాలమున శాసనములను విశ్వబ్రాహ్మణులు అనగా పంచాజ్ఞము వారిలో నొకరగు కమ్మరులు వ్రాయుచుండిరి. శాసనలేఖకుడిని శిల్పి అనిఅనెడివారు.బ్రాహ్మణులకుగాని దేవాలయములకుగాని ఇచ్చిన భూమిని పన్నశ అని పిలుచుచుండిరి.వీరి యుద్ధములలో ఒకరి నొకరు కత్తులతో పొడుచుకొని మరణించిన సంఘటనలు ఎక్కువుగా జరిగినట్లు శాసనములు తెలుపుచున్నవి. కొన్ని చోట్ల పురుషులకు కుళ్ళమ్మ అని పిలుచుచుండిరి. సేనాపతిని చమూపతి అనేవారు. రాజు దైవాంశసంభూతుడని అప్పటి ప్రజల విశ్వాసము. చమూపతి, ధనాధ్యక్షుడు, మహామంత్రి, అమాత్యుడు మున్నగు వారు రాజ్యమునకు అధికారులు. ముఖ్యమైన ఉద్యోగులకు దుగరాజు అను బిరుదు గలదు. క్రింది ఉద్యోగులలో పేరుల చివర 'కాలు' అను పదము ఉంది. రేవణకాలు, పుద్దనకాలు, ఎడ్లకాలు, చేలకాలు, తరట్లకాలు ఉదాహరణలు.

స్త్రీలు కరాభరణములు, ముక్కరలు, కొప్పులకు పూలు, కంకణములు ధరించుచుండిరి.వివాహములు సాధారణముగా నాలుగు రోజులు జరుగు చుండెను.ప్రజలలో వినోద ప్రదర్శనలను ప్రోత్సహించు వారుండిరి.ఆకలమున వాడుకలో నున్న కోడి పందెములు, మేషమహిషయుద్ధములు, పండుగలు, ఏరువాకపున్నమువంటి పండుగలు ప్రజావినోదముల్గా పరిగణింపబడుచుండెను.

కరికాలుని సంతతికిచెందిన వీరు కావేరీ తీరమునగల చోళవంశమువారు. ధనంజయవర్మకు పూర్వమే వీరు తెలుగు దేశానికి వలస వచ్చిఉంటారు. కమలాపురం తాలూకాలో కలమళ్ళ గ్రామంలో ధనంజయవర్మ వేయించిన శిలాశాసనం వారి వంశపువారికే మొదటిదిగాక తెలుగు భాషకే మొదటి వాక్యరచనయై ఉంది. పగిలిఉన్న శిలాభాగములో "ఎరికల్ ముతురాజు ధనుంజయుడు రేణాండు ఏళన్" అనే వాక్య భాగము పూర్తి అర్థమిస్తున్నది. ‘ఎరికల్ ముతురాజు’ అనేది ఒక బిరుదు. లిపిని బట్టి శాసనము ఆరవ శతాబ్దము రెండవ సగము నాటిదని చెప్పుదురు.

రేనాటి చోళులు కాలమున తటాకములు నిర్మింపబడి కాలువులు త్రవ్వింపబడినవి.చెరువులు, కాలువలు త్రవ్వుట హిందూమత సంప్రదాయము ప్రకారము సప్తసంతాన ప్రతిష్ఠలలో చేరునని వీరు అభిప్రాయము.రాజులు వ్యవసాయాభివృద్ధికి కృషిచేయుచుండిరి.దేవభోగములకు బ్రాహ్మణులకు ఇచ్చిన భూమిపై పన్ను ఉండేదికాదు.

వీరి కాలమున వైదికమతము వృద్ధిచెందినట్లు తెలియుచున్నది. యజ్ఞయాగాదులకు ప్రాముఖ్య ఇచ్చినట్లు ఉంది. ఈ కాలమున శైవ మతము ఆంధ్రదేశమున వ్యాపించింది. సూర్యారాధన ఆనాడు విశేషవ్యాప్తిలోనుండెను.గ్రామాధికారులగు రెడ్లు దేవాలయములను నిర్మించెడివారు.

జైనబుద్ధ మతములనాదరించు ప్రజలు, ఆమత సన్యాసుల ప్రవర్తనలననుసరించు చుండిరి.జైన మతముందేర్పడిన కాపాలిక జైన విభాగమున జైనపాలికుల మధుమాంస భక్షణము, కాపాలిక స్త్రీలతో వ్యవహారము, ప్రజలలో సంచలనము బయలు దేరినది.వజ్రయాన బౌద్ధమత విభాగము వలన, బౌద్ధ సన్యాసుల యొక్కయు, సన్యాసినుల యొక్కయు అవధులు లేని ప్రవర్తన ప్రజలలో అసహ్యము కలిగించి వైదిక మతము వైపు వారి మనస్సులను మరల్చినవి.ఇది శైవ విజృంభణకు దోహదమైనది.

రేనాటి చోళులు పాలించిన కాలమున ఆంధ్ర వాజ్మయము ఆరంభదశలో నుండెను. తెలుగు పద్యములను పోలిన పద్యములు వీరి శాసనములందు కనిపించినను అవి గణ యతి ప్రాస నియమరహితముగ నున్నవి.ఇవి గద్యమయములు.ఇందు వృత్తగంధివాక్యము లున్నవి.

ఈకాలపు శాసనములందు ఫలశ్రుతి ఒకేవిధముగా ఉంది. దానమును కాచినవారికి అశ్వమేధ యాగము ఫలమును, వక్రము చేసినవారికి వారణాసిలో బ్రాహ్మణులను, కపిలగోవులను చంపిన పాపము కలుగునని చెప్పిరి.ఫలశృతి అనంతరము ఆజ్ఞప్తి కర్తృ లేఖకుల పేళ్ళు శాసనమున చేర్చబడెను.

ప్రొద్దుటూరి దగ్గర పెన్నానది ఒడ్డున రామేశ్వరాలయమును "పోర్ముఖరామ" అను బిరుదు గల పుణ్యకుమారుడు కట్టించాడు. 
 
 
 



హోం
విభాగాలు:తెలంగాణ చరిత్ర, ఆంధ్రప్రదేశ్ చరిత్ర,


 = = = = =


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Index


తెలుగులో విజ్ఞానసర్వస్వము
వ్యక్తులు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, వార్తలు
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలు, రైల్వేస్టేషన్లు, వార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, జిల్లా విభాగాలు, జిల్లా వ్యాసాలు, మండలాలు, నియోజకవర్గాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, విశ్వవిద్యాలయాలువార్తలు,
సమరయోధులు, రచయితలు, రాజకీయ నాయకులు, అవార్డు గ్రహీతలు, రాష్ట్రాలు, జిల్లాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, ప్రాజెక్టులు, దేవాలయాలు, రాష్ట్రపతులు, ఉప రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు,ముఖ్యమంత్రులు-గవర్నర్లు, క్రీడాకారులు, వార్తలు,
ప్రపంచము,
శాస్త్రవేత్తలు, రచయితలు, దేశాధినేతలు, దేశాలు, నగరాలు, సందర్శనీయ ప్రదేశాలు, నదులు, వార్తలు,
క్రీడలు,  
క్రీడాకారులు, టోర్నమెంట్లు, ఆటలు, వార్తలు,
శాస్త్రాలు,  
భూగోళశాస్త్రము, చరిత్ర, పౌరశాస్త్రము, ఆర్థిక శాస్త్రము, భౌతికశాస్త్రము, రసాయనశాస్త్రము, జీవశాస్త్రము, వృక్షశాస్త్రము, మనస్తత్వశాస్త్రము,
ఇతరాలు,  
జనరల్ నాలెడ్జి, ఉద్యోగ సమాచారం, తెలుగు బ్లాగులు, హాస్యం, కాలరేఖలు, చరిత్రలో ఈ రోజు,

      విభాగాలు: 
      ------------ 

      stat coun

      విషయసూచిక